ఢిల్లీలో బాణసంచా పేలుడు నిషేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

  • ఢిల్లీలో బాణసంచాను పూర్తిగా నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
  • పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరణ
  • ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ వ్యాఖ్య
  • బాణసంచా ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోండని సూచన
దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటూ బుధవారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ఈ పిటిషన్ ను అత్యవసరమైనదిగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైనా, ఢిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

New Delhi
AAP
Supreme Court
Fire Crackers
Diwali

More Telugu News